తొలిరోజు వాడిగా వేడిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు – టిడిపి, వైసిపి రచ్చరచ్చ !

తొలిరోజు వాడిగా వేడిగా తొలిరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు – టిడిపి, వైసిపి రచ్చరచ్చ !
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. టీడీపీ నిరుద్యోగంపై వాయిదా తీర్మానం ఇచ్చి చర్యకు పట్టుబట్టింది. అంతటితో ఆగకుండా స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి ప్లకార్డులతో నిరసనకు దిగారు. టీడీపీ సభ్యులు వారి, వారి స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదే, పదే కోరినా వెనక్కు తగ్గలేదు. ఈ గందరగోళం మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. టీడీపీ తీరుపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రశ్నోత్తరాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.నిరుద్యోగ సమస్య పై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.. చర్చించాలంటూ పట్టుపట్టింది. స్పీకర్ పోడియం దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు.. జాబ్ క్యాలెండర్ ఎక్కడ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల వైఖరిని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుబట్టారు. సభలోకి ప్లకార్డులు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రశ్నోత్తరాలు పెట్టాలని టీడీపీ గొడవ చేసిందని.. ఇప్పుడు ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని, సభను అడ్డుకోవడానికే వాళ్లు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. బీఏసీ సమావేశం నిర్వహించకముందే ఎందుకు ఆందోళన చేస్తున్నారని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.ఈ ప్రభుత్వ హయాంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని.. సభా సమయం వృథా చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని.. అసెంబ్లీ పెట్టాలని టీడీపీ నేతలు సవాల్ చేశారు. అసెంబ్లీ పెడితే చంద్రబాబు మళ్లీ డుమ్మాకొట్టారని.. సభ్యులేమో ఇప్పుడు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. టీడీపీ సభ్యులకు చర్చించే దమ్ము లేదని.. చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నారని.. త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రే అన్నారు. ఈ గందరగోళం మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.అంతకముందు అసెంబ్లీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన తెలిపారు. జాబెక్కడ జగన్ అంటూ నినాదాలు చేశారు.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందంటూ ఆందోళనకు దిగారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ జాబ్ క్యాలెండర్ అన్నారని.. అధికారంలోకొచ్చాక జాబ్ క్యాలెండర్ లేదు.. ఉద్యోగాల భర్తీ లేదన్నారు టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు. టీడీపీ హయాంలో 7 డీఎస్సీలు వేశామని.. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ భృతి ఇచ్చామన్నారు.