Andhra PradeshChittoor
పోలీసే దొంగైన వేళ…. ఓ పోలీస్ చేసిన పని సీసీటీవీ ఫుటేజ్తో బట్టబయలు !

పోలీసే దొంగైన వేళ…. ఓ పోలీస్ చేసిన పని సీసీటీవీ ఫుటేజ్తో బట్టబయలు !
క్యాపిటల్ వాయిస్, చిత్తూరు జిల్లా :- మనకు ఆపద వచ్చినా ఇంట్లో దొంగతనం జరిగిన ముందుగా పోలీసుల దగ్గరకే వెళ్తాం. జరిగిన అన్యాయాన్ని పోలీసులతో మొరపెట్టుకొని న్యాయం జరిగేలా చూడాలని కోరుతాం. అయితే చాలా వరకు పోలీసు అధికారులు నిబద్దతతో తమ విధులను నిర్వర్తిస్తున్నారు. అటువంటి వారిని చూస్తేనే సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. కానీ కొందరు పోలీసుల బుద్ది మాత్రం వక్రమార్గంలో వెళ్లింది. తాజాగా ఓ పోలీస్ చేసిన నిర్వాకం పోలీస్ బాసులకు తలనొప్పి తెచ్చి పెడుతోంది అసలు ఆ పోలీస్ ఏంచేసాడో తెలిస్తే మీకు కోపం రాక మానదు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.చిత్తూరులోని విజయ డెయిరీ సమీపంలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో వ్యానులో దుస్తుల పెట్టి అమ్మకం సాగించేవాడు. రాత్రి మూసేసి మరుసటి రోజు దుకాణాన్ని తెరిచేవాడు. నాలుగు రోజుల క్రితం యూనిఫాం ధరించిన ఓ కానిస్టేబుల్, సివిల్ డ్రెస్లో ఉన్న మరో కానిస్టేబుల్ అర్ధరాత్రి దుకాణం వద్దకు వెళ్లి రెండు బండిళ్ల బట్టలను చోరీ చేశారు. అయితే మరుసటి రోజు ఆ వ్యక్తి వచ్చిచూసేసరికి.. మూటలో దుస్తులు తక్కువగా ఉండటాన్ని గుర్తించాడు.ఈ క్రమంలోనే ఎవరో దుస్తులను దొంగిలించారనే అనుమానంతో అక్కడి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. దీంతో అసలు దొంగ దొరికిపోయాడు. సీసీ ఫుటేజీని చూడటంతో చోరీ చేసిన వ్యక్తి యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ అని వెల్లడైంది. ఆ తర్వాత బాధితుడు ధైర్యంతో ఆ ఫుటేజీని పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేయడంతో దొంగగా మారిన పోలీసు దొరికిపోయాడు. బైక్పై వచ్చినవారిలో ఒకరు కానిస్టేబుల్ కాగా, సాధారణ దుస్తుల్లో మరో వ్యక్తి ఏఎస్ఐగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ దోపిడికి పాల్పడిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో జిల్లా పోలీస్ ఉన్నట్లు సమాచారం.