పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా…….అయితే జరభద్రం ! మైక్రో ప్లాస్టిక్ కణాలతో నరాలపై దుష్ప్రభావం

పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా…….అయితే జరభద్రం ! మైక్రో ప్లాస్టిక్ కణాలతో నరాలపై దుష్ప్రభావం
క్యాపిటల్ వాయిస్, ప్రత్యేక సమాచారం :- మనమందరం కాఫీ లేదా టీలను రోజువారీగా తీసుకోవటానికి ఇష్టపడుతుంటాం. ప్రయాణాలు చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు టీ, కాఫీలు తాగేవారు చాలా మంది ఉన్నారు. టీ,కాపీలు సేవించేందుకు పేపర్ కప్పులు , గ్లాసులు రాకతో వాటిని సేవించడం కూడా సులభతరమైంది. అయితే, ఈ కప్పులు మన ఆరోగ్యానికి వినాశనమేనని కొందరు శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వారి పరిశోధనల్లో సైతం ఇదే
విషయాన్ని వారు కనుగొన్నారు.పేపర్ కప్పుల్లో లీక్ ప్రూఫ్ పొరగా మైక్రోప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. ఇది పేపరు గ్లాసులో ద్రవపదార్థాలను నింపినప్పుడు త్వరగా మెత్తబడిపోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. నిమిషాల వ్యవధిలో టీ, కాఫీలను సేవించి చెత్తబుట్టలో పడేసే వీలుండటం,కడిగేపనిలేకుండా ఈజీగా ఉండటంతో పేపరు కప్పులు, గ్లాసులను విరివిగా ఉపయోగించటం అలవాటుగా మారిపోయింది.
అయితే శాస్త్రవేత్తలు ఈ పేపర్ కప్పులపై జరిపిన పరిశోధనల ద్వారా అందరిని కలవరపరిచే విషయాలను వెల్లడించారు. పేపరు, గ్లాసులు, కప్పుల్లో వేడి ద్రవపదార్ధలతో నింపినప్పుడు కేవలం 15 నిమిషాల సమయంలోనే వాటి పై పొరగా ఉండే మైక్రో ప్లాస్టిక్ కోటింగ్ కరిగిపోయి మనం సేవించేందుకు సిద్ధంగా ఉన్న ద్రవపదార్ధాల్లో కలిసి పోతున్నట్లు నిర్ధారించారు. ప్లాస్టిక్ అయాన్లతో పాటు, భార లోహాలతో మిళితమై ఉన్న వాటిని సేవించటం ఆరోగ్యానికి
హానికరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.పేపరు కప్పులు, గ్లాసులకు ఉండే పై పొరలో ప్లాస్టిక్ అయాన్లతోపాటు జింక్,మాంగనీస్, నికెల్, కాపర్, లెడ్, కాడ్మియం, క్రోమియం, పల్లాడియం లాంటి భారలోహాలను గుర్తించారు. వీటిలోని వేడి ద్రవపదార్దాలను సేవిస్తే క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శరీరంలోని ఇతర అవయవాలపై దుష్పప్రభావం పడుతుంది. ముఖ్యంగా నరాలకు సంబంధించిన జబ్బులైన పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ , సంతానలేమి వంటి సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక పేపర్ కప్పులో రోజుకు మూడు కప్పుల టీ లేదా కాఫీ తాగే సగటు వ్యక్తి
కంటికి కనిపించని 75,000 చిన్న మైక్రోప్లాస్టిక్ కణాలను తీసుకుంటాడని ఖరగ్ పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ కు చెందిన అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ సుధా గోయెల్ చెప్పారు. శరీరంలోకి చేరే చాలా స్వల్ప
పరిమాణంలో ఉండే మైక్రో ప్లాస్టిక్ కణాలు నరాలు, రక్తం ద్వారా ప్రయాణించి శరీర భాగాల్లోకి చేరుతాయి. నరాల వ్యవస్ధను తీవ్రంగా దెబ్బతీస్తాయి.