నెల్లూరు జిల్లాలో ఉగ్ర కదలికలు….. బుచ్చిరెడ్డిపాలెం లో ఎన్ఐఏ అధికారుల సోదాలు..!

నెల్లూరు జిల్లాలో ఉగ్ర కదలికలు….. బుచ్చిరెడ్డిపాలెం లో ఎన్ఐఏ అధికారుల సోదాలు !
క్యాపిటల్ వాయిస్, నెల్లూరు :- పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ముసుగులో ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో ఎన్ఐఏ బృందాలు తెలుగు రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తోంది. అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణలో లభ్యమైన ఆధారాలతో ఏపీలోని నెల్లూరు జిల్లా లోనూ సోదాలు చేసేందుకు వచ్చారు. బుచ్చిరెడ్డిపాలెం ఖాజానగర్లో తనిఖీలు చేశారు. అక్కడ ఇలియాజ్ అనే వ్యక్తి ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ అధికారులు బుచ్చిరెడ్డిపాలెం వచ్చారు. తెల్లవారు జామున వేకువజామున 5 గంటలకు బుచ్చిరెడ్డిపాలెంకి వచ్చి ఇలియాజ్ ఇంట్లో సోదాలు చేశారు.నిజామాబాద్లో జిమ్ ట్రైనర్ని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు టీఎఫ్ఐలో ఇలియాజ్ శిక్షణ పొందాడనే సమాచారం మేరకు బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజానగర్కు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో ఖాజా నగర్లో టిఫిన్ సెంటర్ నిర్వహించే ఇలియాజ్ మూడు నెలలుగా కనపించడం లేదు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దర్యాప్తు కోసం ఎన్ఐఏ అధికారులు.. ఇలియాజ్ కుటుంబ సభ్యులను విచారించారు. అతని భార్య సెల్ ఫోన్ తీసుకుని చెక్ చేయగా.., అతనితో సోషల్మీడియా ఫ్లాట్ పామ్ ద్వారా చాట్ చేస్తుందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.అంతేకాదు ఇలియాజ్ ఇంట్లో ఓ పుస్తకాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పలు కీలక పత్రాలు, ఫోన్ నెంబర్లను ఎన్ఐఏ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. అనంతరం ఇలియాజ్ స్నేహితుల ఇళ్లలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇలియాజ్ ఇంటి నుంచి అధికారులు తిరిగి వస్తుండగా స్థానికులు వారిని అడ్డుకున్నారు. లోపల ఏం జరిగిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎన్ఐఏ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పారు. నిజామాబాద్ జిల్లాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు జిల్లా పోలీసులు గుర్తించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో ఎన్ఐఏ రంగంలోకి దిగి వేట మొదలుపెట్టింది. తొలుత ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల క్రితం కరాటే ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. తర్వాత మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కొంత కాలం దుబాయ్లో పని చేసిన ఖాదర్ భారత్కు తిరిగి వచ్చాడు. పీఎఫ్ఐలో చురుగ్గా పాల్గొంటున్న ఖాదర్.. కరాటే ముసుగులో యువతను రెచ్చగొట్టేలా ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నాడని గుర్తించారు. అక్కడ మొదలైన ఎన్ఐఏ వేట.. తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగిస్తూ నెల్లూరు జిల్లా వరకు వచ్చింది.