Andhra PradeshVisakhapatnam

ఇది పశువుల పాక కాదు….పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలే !

ఇది పశువుల పాక కాదు….పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలే !

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామం
రేకుల షెడ్‌లో స్కూల్ నిర్వహణ
వర్షాకాలంలో విద్యార్థుల కష్టాలు

క్యాపిటల్ వాయిస్, విశాఖ జిల్లా ప్రతినిధి :- ఈ స్కూల్‌ను చూడండి.. వానొచ్చినా, ఎండొచ్చినా చాలా కష్టం కదూ. చలి కాలమైతే పిల్లలు గజగజా వణుకుతూ పాఠాలెలా వింటారో..? ఇంతకీ ఇక్కడ స్కూల్ భవనం ఎక్కడుందబ్బా అని ఆలోచిస్తున్నారా..? మీరు చూస్తున్నది పశువుల పాక కాదు.. ప్రభుత్వ పాఠశాలే. ఆ షెడ్డు కింద పిల్లలకు పాఠాలు చెప్తోంది కూడా గవర్నమెంట్ టీచరే. విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయితీ పరిధిలోని లబడపుట్ గ్రామమిది. మండల కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో విసిరేసినట్టుగా ఉంటుంది. ఈ గిరిజన గ్రామంలో 25 కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. తమ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని, గొప్ప కొలువులు సంపాదించాలని అందరు తల్లిదండ్రుల్లానే వీళ్లూ ఆశ పడుతున్నారు. కానీ, గ్రామంలో కూర్చొని చదువు నేర్చుకునేందుకు సరైన పాఠశాల భవనమే లేదు.వీళ్ల ఆవేదనకు అర్థం ఉంది. అక్కడ తరగతులు జరుగుతున్నప్పుడు భారీ వర్షం పడితే.. ఆ చెట్టూ, పుట్టల్లోంచి ఏ పాము వస్తే.. కష్టమే కదా? కొన్నేళ్ల కిందట ఇక్కడో పాఠశాల భవనం ఉండేది. 30 మంది విద్యార్థులు చదువుకొనేవారు. ఆ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో, అధికారులు దాన్ని కూల్చి వేయించారు. ఆ తర్వాత నూతన భవనానికి పునాది కూడా వేశారు. కానీ, అది పునాది వద్దే ఆగిపోయి వెక్కిరిస్తోంది.గ్రామస్థులు చేసేదేం లేక ఇలా రేకుల షెడ్ నిర్మించుకున్నారు. అందుకోసం తలా కొంత డబ్బు వేసుకున్నారు. ఇప్పుడా పాకలోనే తరగతులు కొనసాగుతున్నాయి. పాఠశాల భవనం బాగోలేక 15 మంది పిల్లలు ఇతర పాఠశాలలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 15 మంది మాత్రమే మిగిలారు. అధికారులు స్పందించి నాడు-నేడులో భాగంగా తమ ఊరికి నూతన పాఠశాల భవనం నిర్మించి ఇవ్వాలని విద్యార్థులు, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్ కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!