International

గాఢనిద్రలో ఘోరం.. భవనానికి నిప్పంటుకుని 46 మంది సజీవదహనం

గాఢనిద్రలో ఉండగా ఘోరం.. భవనానికి నిప్పంటుకుని 46 మంది సజీవదహనం

  • అపార్ట్‌మెంట్‌లో వ్యాపించిన మంటలు.
  • ఏడు నుంచి 11 అంతస్తులో భారీ నష్టం.
  • గుర్తుపట్టలేనంతంగా కాలిపోయిన మృతదేహాలు

క్యాపిటల్ వాయిస్, అంతర్జాతీయం :- తైవాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 46 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. దక్షిణ తైవాన్‌లోని 13 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. కాహ్సియుంగ్ నగరంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. అయితే, భవనంలో అస్తవ్యస్తంగా సామగ్రి పడి ఉన్నచోటే మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ‘ఇది అత్యంత భయంకరమైన అగ్నిప్రమాదం.. దీని తీవ్రతకు భవనంలోని పలు అంతస్తులు ధ్వంసమయ్యాయి’ అని ఓ అధికారి వెల్లడించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పేలుడు శబ్దం విన్నామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనంలో కింద షాపింగ్ కాంప్లెక్స్లు, పైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారినే అధికారులు లెక్కించారు. భవనం శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్ని కాలిబూడిదయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. కేవలం 11 మృతదేహాలను మాత్రమే మార్చురీకి తరలించారు. ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 మందికిపైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. ఏడు నుంచి పదకొండే అంతస్తు మధ్యలో ఉన్నవారే ఎక్కువగా చనిపోయినట్టు భావిస్తున్నారు. తొలి ఐదు అంతస్తుల్లో వాణిజ్య సముదాయాలు ఉన్నట్టు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!