దేశవ్యాప్తంగా 86 పార్టీలను, ఏపి నుంచి 6 పార్టీలను జాబితా నుంచి తొలగించిన ఎన్నికల సంఘం

దేశవ్యాప్తంగా 86 పార్టీలను, ఏపి నుంచి 6పార్టీలను జాబితా నుంచి తొలగించిన ఎన్నికల సంఘం
క్యాపిటల్ వాయిస్, జాతీయం :- తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని ట్విస్ట్. మంగళవారం దేశవ్యాప్తంగా 86 పార్టీలను జాబితా నుంచి తొలగించిన ఎన్నికల సంఘం. పార్టీ రిజిస్టర్ అయ్యాక ఐదేళ్లలోపు ఎన్నికలు సంఘం నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఆరేళ్ల పాటు ప్రతి ఎన్నికల్లో పోటీ చేయకపోతే రిజిస్టర్ పార్టీల జాబితా నుంచి పార్టీని తొలగిస్తారు. ఏపీలో ఆరు పార్టీలను జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాశాంతి పార్టీకి కూడా ఈసీ షాకిచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశవ్యాప్తంగా కొన్ని రాజకీయ పార్టీలకు ఝలక్ ఇచ్చింది. ఏపీలో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీ (ఆర్యూపీపీ)లను ఈసీఐ జాబితా నుంచి తొలగించింది. మే 25న ఆర్యూపీపీల విధివిధానాలను అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన చర్యల్లో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా 86 పార్టీలను జాబితా నుంచి తొలగించింది. అలాగే ఉనికిలోలేని 253 పార్టీలను క్రియారహిత ఆర్యూపీపీలుగా ప్రకటించడంతో ఇప్పటివరకు ఉనికిలోలేని పార్టీల సంఖ్య 537కి చేరింది. ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించిన ఆర్యూపీపీల సంఖ్య 284కు చేరింది..పార్టీ రిజిస్టర్ అయ్యాక ఐదేళ్లలోపు ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో పోటీచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోటీ చేస్తూనే ఉండాలి. పార్టీ ఆరేళ్లపాటు ప్రతి ఎన్నికల్లో పోటీచేయకపోతే రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి పార్టీ తొలగిస్తారు. ఏపీలో ఈసీఐ జాబితా నుంచి తొలగించిన పార్టీల విషయానికి వస్తే.. ఆలిండియా ముత్తాహిదా ఖ్వామీ మహాజ్, భారత్దేశం పార్టీ, ఇండియన్స్ ఫ్రంట్, జాతీయ తెలుగు అభివృద్ధి సేవాసమూహం, మన పార్టీ, ప్రజాభారత్ పార్టీలు ఉన్నాయి.మరోవైపు ప్రజాశాంతి పార్టీ కి కూడా ఈసీ ట్విస్ట్ ఇచ్చింది. క్రియాశీలకంగా లేని పార్టీల జాబితాలో ప్రజాశాంతి పార్టీని చేర్చింది. యాక్టివ్గా లేని పార్టీలకు కామన్ సింబల్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 2008లోనే ప్రజా శాంతి పార్టీని రిజిస్టర్ చేయించారు.. ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తును ఈసీ కేటాయించింది. 2009లో ప్రజా శాంతి పార్టీ తరపున 11 మంది బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు. కానీ 2019 ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు.. కేఏ పాల్ నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయగా.. అందరూ ఓడిపోయారు. కొద్దిరోజుల క్రితం తెలంగాణలో కూడా యాక్టివ్ అవుతామని చెప్పారు.