అవును…….. అతడు అడవిని దత్తత తీసుకున్నాడు !


అవును…….. అతడు అడవిని దత్తత తీసుకున్నాడు !
క్యాపిటల్ వాయిస్, కారంపూడి :- అవును అతను నల్లమల అడవిని దత్తత తీసుకున్న శ్రీమంతుడు , మీరు వింటున్న ఈ మాట నిజం. వివరాల్లోకి వెళితే.నలిగిన చొక్కా, రబ్బరు చెప్పులు వేసుకొని, చేతిలో గోతం పట్టుకొని నిత్యం నల్లమల అడవిలో ఏదొక ప్రాంతంలో తిరుగుతూ, అడవిని కాపలాగా ఉంటుంటాడు.అతని పేరు కొమెర అంకారావు, అందరు జాజి అని పిలుస్తుంటారు. ఊరు కారంపూడి గ్రామం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్..తన చిన్నతనం నుండే ప్రతి రోజు ఉదయమే తన ఊరు సమీపంలో ఉన్న అడవికి వెళ్లి అక్కడ నుండి అడవిలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ అడవి ప్రాణులను వేటాడకుండా కాపలాగా ఉంటుంటాడు, అక్కడ వేటాడే వారికి ప్రకృతి, అడవులు గొప్ప తనం, ప్రాణుల ప్రాముఖ్యతను చెప్పి వారిలో మార్పు తెస్తుంటాడు.
ప్లాస్టిక్ ఏరివేయుట……….నల్లమల అడవుల్లో పలు ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ అడవికి హాని చేస్తున్న, ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లు, డిస్పోజ్ గ్లాసులు అన్ని ఏరి వేసి పూర్తిగా అడవి బయటకు తెచ్చి పడేస్తుంటాడు. ఇప్పటికే ఎన్నో వేల ఎకరాలు తిరిగి అడవిని శుభ్రం చేశాడు అంటే అతిశయోక్తి కాదు.
ఋతువులను బట్టి అడవికి అండగా ఉంటాడు.…..మండు వేసవిలో కాలుతున్న అడవిలో ఎంత ఎత్తైన కొండలు ఎక్కి అయినా సరే, పచ్చి మండలతో కాలుతున్న అడవిని ఆర్పీ వేస్తుంటాడు. ఎన్నో మూగ జీవాలకు ప్రాణం పోస్తుంటాడు. వర్షాకాలంలో మొక్కలు నాటడం.ప్రతి వర్షాకాలంలో మొక్కలు నాటుతూ అడవిని వృద్ధి చేయిస్తుంటాడు. ముఖ్యంగా పండ్ల మొక్కలు నాటుతూ, వాటికి సంవత్సరం అంత కూడ నీళ్ళు పోసి కాపాడుతుంటాడు.
తొలకరి జల్లుల సమయంలో విత్తన బంతులు…….తొలకరి జల్లుల సమయంలో ఎత్తయినా కొండలు, గుట్టలు, కుంటలు,మైదాన పలుచని ప్రాంతాలలో విత్తనబంతులు( సీడ్ బాల్స్ ) చళ్ళుతుంటాడు, ఈ ఒక్క సంవత్సరంలోనే కోటి విత్తనబంతులు అడవిలో చల్లి అడవిపై తన ప్రేమ చాటుకున్నాడు.
అరుదైన ఔషధ మొక్కలను గుర్తించి కాపాడటం…..అంతరించిపోతున్న అరుదైన ఔషద మొక్కలు గుర్తించి, నీళ్ళు పోసి కాపాడుతున్నాడు. ఒక్క అరుదైన మొక్క అంతరించిపోతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన తిరిగి తీసుకురాలేము అంటాడు జాజి
పక్షుల కోసమే పంట…..తనకు జీవనాధారంగా ఉన్న ఒకే ఒక్క ఎకరం పొలంలో ప్రతి సంవత్సరం కూడ సజ్జ, జొన్న పంట వేసి, సేంద్రియ వ్యవసాయం పద్దతిలో పంట పండించి పూర్తిగా పక్షుల కోసమే వదిలేసి, అవి తింటుంటే ఆనంద పడుతుంటాడు జాజి.
విద్యార్థులకు ప్రకృతి పాఠాలు……..తనకు అవకాశం ఉన్నప్పుడు ఏదొక పాఠశాలకు వెళ్లి అక్కడ విద్యార్థులకు ప్రకృతి పాఠాలు ఉచితంగా చెప్పి, వారిని పూర్తిగా ప్రకృతి ప్రేమికులుగా మారుస్తుంటాడు.ఇప్పటికి రెండు తెలుగు రాష్టాలలో సుమారుగా 6000 పాఠశాలలో ప్రకృతి పాఠాలు చెప్పి ఎంతో మంది విద్యార్థులు ప్రకృతి పై ఆసక్తి కలిగేలా చేశాడు..
ప్రకృతి కోసం పుస్తకాల రచనలు……ప్రకృతి సంరక్షణ కోసం, అడవి జ్ఞానం కోసం, ఇప్పటికి నాలుగు పుస్తకాలు, 1.ప్రాచీన మూలికా వైద్యం 2. ప్రకృతి పాఠశాల 3. ప్రకృతి వైద్యం,4. ప్రకృతి ఆహారం అనే పుస్తకాలు రాసి, వాటిని కూడ ఉచితంగా ప్రతి పాఠశాలలో విద్యార్థులు కొరకు ఇస్తుంటాడు.జాజి గురించి పత్రికలు, వివిధ కధనాలు, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న, పల్నాడు జిల్లా కలెక్టర్ లొతేటి శివశంకర్ స్వయంగా జాజి ఇంటికి వచ్చి అభినందనలు తెలియజేసి, నల్లమల అడవిలో ఉన్నతాధికారులతో కలిసి అతని చేస్తున్న ప్రకృతి అడవితల్లి సేవను చూసి ఆశ్చర్యపోయాడు.

